తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh Uravakonda March 05, 2026

శనగ రైతు కంట కన్నీరు.

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)
శనగ రైతు కంట కన్నీరు: క్వింటాకు ₹8,000 చెల్లించాలని ఉరవకొండలో భారీ నిరసన
ఉరవకొండ, మన జన ప్రగతి మార్చి 05, 2026:
రబీ సీజన్‌లో ఆశించిన దిగుబడి రాక, పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక శనగ రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్వింటా శనగలకు మద్దతు ధరతో పాటు బోనస్ కలిపి ₹8,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం 11 గంటలకు ఉరవకొండ వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
అంతర్జాతీయ ఒప్పందాల సెగ.. దళారుల దోపిడీ
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.హెచ్. రాయుడు, సహాయ కార్యదర్శి ఎన్. మధుసూదన్ మాట్లాడుతూ.. ఉరవకొండ డివిజన్ పరిధిలోని బెళుగుప్ప, విడపనకల్లు, వజ్రకరూర్ మండలాల్లో వేల ఎకరాల్లో శనగ సాగు జరిగిందన్నారు. అయితే, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాల ప్రభావంతో మార్కెట్‌లో శనగ ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదునుగా భావించిన దళారులు, సిండికేట్‌గా మారి క్వింటాకు 5 కేజీల వరకు తరుగు తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వానికి రైతు సంఘాల ప్రధాన డిమాండ్లు:
నిరసనకారులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. వాటిలో ముఖ్యమైనవి:
 * మద్దతు ధర + బోనస్: కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ₹5,650 కు అదనంగా ₹2,350 బోనస్ కలిపి, క్వింటాకు ₹8,000 చొప్పున ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
 * కేరళా మోడల్: కేరళ ప్రభుత్వం తరహాలో ఎం.ఎస్.పి కి అదనంగా బోనస్ ఇచ్చే విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలి.
 * క్రిమినల్ కేసులు: అధిక తరుగు తీస్తూ రైతులను మోసం చేస్తున్న దళారులపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
 * గోడౌన్ బాడుగ: మార్కెట్‌లో ధర లేక గోడౌన్లలో పంటను నిల్వ చేసుకున్న రైతుల అద్దె ఖర్చులను ప్రభుత్వమే భరించాలి.
 * బ్యాంకు రుణాలు: నిల్వ ఉన్న పంట పత్రాల ఆధారంగా రైతులకు తక్షణమే బ్యాంకు లోన్లు మంజూరు చేయాలి.
 * బీమా & ఈ-క్రాప్: రబీ పంటలకు ఈ-క్రాప్ చేసిన రైతులకు రశీదులు ఇచ్చి, ఉచిత పంట బీమా సౌకర్యం కల్పించాలి.
చిన్న రైతుల పరిస్థితి దయనీయం
ఆర్థిక ఇబ్బందుల వల్ల పంటను నిల్వ చేసుకోలేక, దళారులు అడిగిన తక్కువ ధరకే అమ్ముకుంటూ చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు శినప్ప, సిద్దప్ప, మురళి, విరాంజనేయులు, శివ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.