తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || National March 10, 2026

త్వరలో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు.. ఈ వారం షెడ్యూల్ ప్రకటించే అవకాశం

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

 త్వరలో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

హైదరాబాద్: దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈ వారం లోగా ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని పూర్తి స్థాయి ఎన్నికల సంఘం బృందం పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తోంది. ఆ బృందంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బిర్ సింగ్ సంధు మరియు వివేక్ జోషి కూడా ఉన్నారు. బంగాల్‌లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన అనంతరం బృందం ఢిల్లీకి తిరిగి వెళ్లనుంది.

అక్కడ అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష పూర్తి చేసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశముందని ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహకాలను ఎన్నికల కమిషన్ పరిశీలించింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో సమీక్ష పూర్తి అయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక ఈ రాష్ట్రాల అసెంబ్లీ గడువులు కూడా ముగింపు దశకు చేరుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7న ముగియనుండగా, తమిళనాడు అసెంబ్లీ కాలపరిమితి మే 10న ముగియనుంది. అసోం అసెంబ్లీ గడువు మే 20 వరకు ఉండగా, కేరళ అసెంబ్లీ కాలపరిమితి మే 23న ముగియనుంది. ఇదే సమయంలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికల్లో పారదర్శకతను పెంచేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించగలుగుతారు. రిటర్నింగ్ ఆఫీసర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

దీంతో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడగలుగుతామని ఎన్నికల అధికారులు తెలిపారు.