తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Anantapur Andhra Pradesh Uravakonda March 16, 2026

అక్రమ రవాణా సెగ.. రవాణా రంగం విలవిల!

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)


 ఉరవకొండలో తిష్టవేసిన 64 అక్రమ వాహనాలు.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు.

జిల్లా కలెక్టర్‌కు ‘షిరిడి సాయి లైట్ మోటార్ వెహికల్ అసోసియేషన్’ ఫిర్యాదు.

ఉరవకొండ, మార్చి 16: ఉరవకొండలో అక్రమ ప్రయాణికుల వాహనాలు భారీగా పెరిగిపోవడంతో స్థానిక రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. దశాబ్దాలుగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు ఇప్పుడు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం ‘షిరిడి సాయి లైట్ మోటార్ వెహికల్ అసోసియేషన్’ సభ్యులు అనంతపురం జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఉరవకొండ నుంచి అనంతపురం వరకు సుమారు 64 సీఎన్‌జీ మారుతి ఎర్టిగా కార్లు అక్రమంగా ప్రయాణికులను తరలిస్తున్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిబంధనలు గాలికి… వసూళ్లు జోరుగా

ఈ వాహనాలకు సరైన పర్మిట్లు లేకపోవడంతో పాటు చాలా వాహనాలకు అవసరమైన రికార్డులు కూడా లేవని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.100 వసూలు చేస్తూ రోజుకు సుమారు రూ.1,40,000 వరకు వసూళ్లు జరుగుతున్నాయని, దీని వల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టం కలుగుతోందని ఆరోపించారు. ముఖ్యంగా ఏపీఎస్‌ఆర్‌టిసి (APSRTC) కు ఈ అక్రమ రవాణా కారణంగా గణనీయమైన నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.

ప్రశ్నిస్తే దాడులు

తాము ప్రతి సంవత్సరం టాక్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ ఫీజులు కలిపి లక్ష రూపాయల వరకు చెల్లిస్తున్నామని డ్రైవర్లు తెలిపారు. అయితే అక్రమంగా నడిచే వాహనాలకు ఎలాంటి ఖర్చులు లేకపోవడం వల్ల పోటీ పడలేకపోతున్నామని చెప్పారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే కొందరు తమపై దాడులకు దిగుతున్నారని వారు ఆరోపించారు.

అధికారుల మౌనం ఎందుకు?

ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విచారణ జరిపి అక్రమ వాహనాలను సీజ్ చేసి తమ జీవనోపాధిని కాపాడాలని జిల్లా ఉన్నతాధికారులను కోరారు.
ఈ ఫిర్యాదు చేసిన వారిలో అసోసియేషన్ సభ్యులు బి.కృష్ణ, జి.రవిశంకర్, కె.కుమారస్వామి, ఎస్.మస్తాన్, బి.సురేష్, వి.శివప్ప, డి.నాగభూషణ తదితరులు ఉన్నారు.