బలహీన నాయకత్వమే ప్రపంచ సంక్షోభాలకు కారణమని వ్యాఖ్య
వాషింగ్టన్/హనోయి, మార్చి 2:
ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ప్రముఖ పెట్టుబడిదారు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ గ్రంథ రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్ దాడుల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన ఆయన, అంతర్జాతీయ ఘర్షణలు మతపరమైన, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు.
తాను హనోయిలో ఉన్న సమయంలోనే ఇరాన్ యుద్ధ వాతావరణం ప్రారంభమైందని తెలిపారు. దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు కేవలం భూభాగాల కోసం కాకుండా చమురు వనరులు, ఆర్థిక ఆధిపత్యం కోసం జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
అమెరికా రాజకీయాలపై కూడా ఆయన స్పందించారు. జో బైడెన్ హయాంలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ వార్ఎ ప్పుడు ముగుస్తుందో ప్రశ్నించారు. బలహీన నాయకత్వం ప్రపంచాన్ని సంక్షోభాల్లోకి నెడుతోందని వ్యాఖ్యానించారు.
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను దృఢ నాయకుడిగా అభివర్ణించిన కియోసాకి, కఠిన నిర్ణయాలు తీసుకునే నాయకత్వం అవసరమని తెలిపారు. అంతర్జాతీయ అస్థిరతల సమయంలో బంగారం, వెండి, డిజిటల్ నాణేలు వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు హెచ్చుతగ్గులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.