హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొత్త రాజకీయ చర్చలకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన రహస్య డిన్నర్ మీటింగ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సమాచారం ప్రకారం, ఈ సమావేశానికి మొత్తం 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపగా, గురువారం సాయంత్రం మహబూబ్నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా హాజరైనట్లు తెలుస్తోంది.
కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారనే భావనతో, కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ రహస్య డిన్నర్ సమావేశం అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరిక వార్తలతో కాంగ్రెస్లో చర్చలు కొనసాగుతున్న సమయంలో, ఈ 9 మంది ఎమ్మెల్యేల సమావేశం మరో రాజకీయ సంచలనంగా మారింది.
ఈ మీటింగ్ కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా? లేక పెద్ద రాజకీయ మార్పులకు నాందా? అనే చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. మరోవైపు, రాజగోపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం వినిపించడం గమనార్హం.
తెలంగాణ రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
