హైదరాబాద్లో దోశ, పూరి, వడ బంద్.. గ్యాస్ కొరతతో హోటళ్లకు సంక్షోభం
హైదరాబాద్: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతల ప్రభావం భారత్లో కూడా కనిపిస్తోంది. గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా హైదరాబాద్ నగరంలో హోటళ్లు, హాస్టళ్లు, మెస్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో కొన్ని హోటళ్లు మెనూను కుదించగా, మరికొన్ని ధరలను పెంచాయి.
హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ ప్రకటన ప్రకారం గ్యాస్ కొరత కారణంగా ఎక్కువ సమయం పట్టే వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ నూనె, ఎక్కువ సమయం అవసరమయ్యే దోశ, పూరి, వడ, చపాతీ, టీ, కాఫీ వంటి వంటకాలను కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మెనూ నుంచి తొలగించాయి.
అదే సమయంలో నగరంలోని పీజీ హాస్టళ్లు, మెస్లు కూడా వంటకాల జాబితాను తగ్గించాయి. ఎక్కువ సమయం పట్టే వంటలను తగ్గించి ప్రస్తుతం అన్నం, సాంబార్, పప్పు, రసం వంటి సరళమైన భోజనాలనే అందిస్తున్నాయి.
గ్యాస్ సరఫరా సమస్య కొనసాగితే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితి మెరుగుపడకపోతే కొన్ని హాస్టళ్లు, మెస్లు తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఇక రవాణా ఖర్చులు కూడా పెరగడంతో కొన్ని హోటళ్లు ధరలను పెంచాయి. ముఖ్యంగా దోశ, పూరి, వడ వంటి వంటకాలపై కనీసం రూ.15 వరకు, అలాగే ఇడ్లీ, ఉప్మా వంటి వంటకాలపై రూ.10 వరకు ధరలు పెంచినట్లు తెలుస్తోంది.
గ్యాస్ కొరత సమస్య త్వరగా పరిష్కారమైతేనే హోటళ్లలో సాధారణ పరిస్థితులు తిరిగి వస్తాయని హోటల్ రంగం ప్రతినిధులు చెబుతున్నారు.