ఉరవకొండ : అమాయక రైతు కష్టాన్ని విద్యుత్ ప్రమాదం బూడిద చేసింది. ఉరవకొండ మండలం మైలారం పల్లి గ్రామంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక రైతుకు భారీ ఆస్తి నష్టం సంభవించింది. స్థానికులు మరియు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామ శివారులోని చీని తోట సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి. ఆ నిప్పుకణాలు ఎండిన గడ్డిపై పడటంతో మంటలు వేగంగా తోటలోకి వ్యాపించాయి. ఈ క్రమంలో తోటలోని చీని చెట్లతో పాటు, సాగుకు ఏర్పాటు చేసుకున్న డ్రిప్ పరికరాలు (పైపులు, నోజిళ్లు) మంటలకు పూర్తిగా ఆహుతయ్యాయి.రూ. 5 లక్షల నష్టం
ఈ అగ్నిప్రమాదంలో దాదాపు రూ. 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అప్పులు చేసి నిర్మించుకున్న డ్రిప్ సిస్టమ్ కాలిపోవడంతో ఆ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.కంటికి రెప్పలా కాపాడుకున్న తోట, చేతికొచ్చే సమయంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల బూడిదైపోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
విద్యుత్ అధికారుల నిర్వహణ లోపం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితుడికి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.
