ఆప్‌లో కలకలం: రాఘవ్ చద్దా డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పార్టీ కీలక నేత అరవింద్కే జ్రీవాల్ సంబంధించిన పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా వ్యవహార శైలి తీవ్ర చర్చకు దారి తీసింది. కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన సమయంలోనూ, అనంతరం విడుదలైనప్పుడు కూడా చద్దా మౌనం పాటించారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కేజ్రీవాల్ నిర్దోషిగా తేలిన తరువాత కూడా ఆయన స్పందించకపోవడం కార్యకర్తల్లో అసంతృప్తి పెంచినట్లు సమాచారం.

పార్టీ కార్యకర్తలు కేజ్రీవాల్‌కు మద్దతుగా నిరంతరం ప్రచారం చేస్తుండగా, చద్దా మాత్రం లండన్‌లో వ్యక్తిగత కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో పార్లమెంట్‌లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఎల్‌పీజీ గ్యాస్ ధరల వంటి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా, మొబైల్ రీఛార్జ్ అంశాలపై ఎక్కువగా మాట్లాడినట్లు పార్టీ అంతర్గత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఆప్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో పార్టీ తరఫున రాఘవ్ చద్దాకు మాట్లాడేందుకు సమయం కేటాయించవద్దని రాజ్యసభ సెక్రటేరియట్‌కు అధికారికంగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అదనంగా, ఆయనను రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుండి తొలగిస్తూ, ఆ స్థానంలో పంజాబ్‌కు చెందిన ఎంపీ అశోక్ మిట్టల్‌ను నియమించినట్లు పార్టీ ప్రకటించింది.

ఈ పరిణామాలు ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత విభేదాలకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాయకత్వ మార్పులు, వ్యూహాత్మక నిర్ణయాలపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ