పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ సిద్ధం

0
హైదరాబాద్‌: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం శిల్పారామంలో జరగనున్న *“తెలంగాణ టూరిజం కాంక్లేవ్‌ – 2025”*లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు నూతన ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు. పర్యాటక రంగంలో విస్తృతమైన అవకాశాలను సృష్టించి యువతకు ఉపాధి కల్పించడం, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వం – ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి లభించనుంది. అనంతగిరి కొండల్లో వెల్‌నెస్ సెంటర్‌, వైన్ తయారీ యూనిట్‌, తాజ్ సఫారీ, వాటర్‌ఫ్రంట్ రిసార్ట్స్‌, ఫైవ్ స్టార్ హోటళ్లు, టైర్-2 నగరాల్లో జింజర్ హోటళ్లు, నాగార్జునసాగర్‌లో వెల్‌నెస్ రిట్రీట్ వంటి ప్రాజెక్టులు ముఖ్యమంత్రిచే ఆవిష్కరించబడతాయి. బౌద్ధవనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు తైవాన్‌కు చెందిన Fo Guang Shan ముందుకు వస్తోంది. అదే విధంగా, ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్టల్ ద్వారా సినిమా నిర్మాణాలకు సింగిల్ విండో అనుమతులు, ఏఐ ఆధారిత లొకేషన్ క్లియరెన్స్ సౌకర్యం అందించనున్నారు. వైద్య పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు మెడికల్ వాల్యూ టూరిజం (ఎంవీటీ) పోర్టల్ ప్రారంభించబడుతుంది. హెలి టూరిజం సేవలను హైదరాబాద్‌–శ్రీశైలం మార్గంలో ప్రవేశపెట్టి దానిని విస్తరించే ప్రణాళిక ఉంది. ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం, పర్యాటకులకు డిజిటల్ టూరిజం కార్డులు అందించడం, ఉత్తమ సేవలందించే సంస్థలకు అవార్డులు ప్రదానం చేయడం వంటి చర్యలు చేపట్టనున్నారు. హుస్సేన్ సాగర్‌లో 120 సీట్లు కలిగిన డబుల్ డెక్కర్ బోట్‌ను కూడా ప్రారంభించనున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!