ఇదేనా సుపరిపాలన?
ఉరవకొండ, అక్టోబర్ 26: అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ దేవస్థానాల పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. కీలక స్థానాల్లో అధికారుల కొరత, ఇన్ఛార్జి పాలన, మరియు బాధ్యతారహిత ప్రవర్తనతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొనడంపై 'ఇదేనా సుపరిపాలన?' అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పోలీసు, రెవెన్యూ శాఖల్లో ఇన్ఛార్జిల రాజ్యం
ఉరవకొండలో పాలనా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. కీలక శాఖలలో పరిస్థితి దారుణంగా ఉంది.
పోలీస్ శాఖ: ఉరవకొండ గ్రామీణ సర్కిల్ అధికారి (సీఐ) పదవి గత మూడు నెలలుగా ఖాళీగా ఉంది. అంతేకాకుండా, గ్రామీణ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ సైతం లేరు. కేవలం ఇన్ఛార్జి పాలనతో ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదు.దొంగతనాలు,పేకాట జూదాలు, ఊరూరా బెల్టు దుకాణలతో పోలీస్ నియంత్రణ కష్టతరమైంది.
రెవెన్యూ కార్యాలయం: ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్గా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాసిల్దార్ కూడేరుకు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని, కేవలం చుట్టపుచూపుగా విధులు నిర్వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. క్యాంపులు, ముఖ్యమంత్రి/ప్రధానమంత్రి పర్యటనల ముసుగులో ఆయన ఇక్కడా, అక్కడా సేవలు అందిస్తూ, వేలాది రూపాయల జీతాలు పొందుతున్నా... పాలన మాత్రం లోపభూయిష్టంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంపీడీవో కార్యాలయం: ఎంపీడీవో సైతం వేళాపాళా లేకుండా విధులకు హాజరవుతున్నారు. తరచూ సెలవుల్లో ఉండటం లేదా 'క్యాంపు' ముసుగులో చెక్కర్లు కొడుతుండటంతో పనులు ఆలస్యమవుతున్నాయి.
గ్రామ పంచాయతీ: మేజర్ గ్రామ పంచాయతీలో శానిటరీ పోస్టు ఖాళీగా ఉన్నా, నియమించిన దాఖలాలు లేవు.
దేవస్థానాలలో అస్తవ్యస్తమైన పాలన
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లోనూ పరిపాలన పరిస్థితి భిన్నంగా లేదు.
గవిమఠం సంస్థానం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన గవిమఠంలో సహాయ కమిషనర్ (ఏసీ) బదిలీపై వెళ్లి ఆరు నెలలు కావస్తున్నా, ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. అర్హత లేని ఓ గ్రూప్ టెంపుల్ అధికారిని మేనేజర్గా కొనసాగిస్తున్నారు.
పెన్నహోబిలం దేవస్థానం: పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం దేవస్థానం ఈవో రమేష్ బాబు ఆరోపణల నేపథ్యంలో సెలవుపై వెళ్లారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయకపోవడంతో, అనంతపురం ఎండోమెంట్ ఏసీ తిరుమల్ రెడ్డి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇన్ఛార్జి పాలన కారణంగా భక్తులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నూతన రథ నిర్మాణానికి నిధులు, అనుమతులు పెద్ద అడ్డంకిగా మారాయి.
మంత్రి అందుబాటులో లేకపోవడంతో ప్రజల వేదన
ఉరవకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఆయన సోదరులు స్థానికంగా అందుబాటులో లేకపోవడం ప్రజలకు మరింత కష్టంగా మారింది. తమ సమస్యలను విన్నవించుకోవాలంటే స్థానికంగా కలిసే అవకాశం లేక, అనంతపురం వెళ్లి, చోటామోటా నాయకులు/కార్యకర్తల ద్వారా సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంత జరుగుతున్నా, అధికారులు ప్రజా ప్రతినిధుల ఎదుట నక్క వినయాలు ప్రదర్శిస్తూ, ముఖస్తుతి చేస్తున్నారని; వారి వెనకాల మాత్రం మరోలా వ్యవహరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
లబ్ధిదారులు, ఉరవకొండ ప్రజలు స్పందిస్తూ... మంత్రివర్యులు తమ నియోజకవర్గంలో నెలకొన్న ఈ ఇన్ఛార్జిల పాలన సమస్యను గుర్తించి, తక్షణమే స్పందించి, సుపరిపాలన అందించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments
Post a Comment