విదేశాలలో దాదాపు వినియోగం తగ్గిపోయిన డబుల్ డెక్కర్ బస్సులు మనదేశంలో మాత్రమే నడుస్తుండటం ప్రమాదకరమని నాయకులు పేర్కొన్నారు. ఇటువంటి బస్సులను రవాణా సేవల నుండి పూర్తిగా తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా, అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కిస్తూ నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
స్కూల్, కాలేజ్ బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలించడం, సేఫ్టీ గ్రిల్ లేకుండా బస్సులను నడపడం, ఫిట్నెస్ లేకుండా రోడ్డుపై వాహనాలను వదలడం వంటి అంశాలు విద్యార్థుల భద్రతకు తీవ్రమైన ముప్పని నాయకులు తెలిపారు. వృద్ధ డ్రైవర్లను కొనసాగించడం, అనుభవం లేని డ్రైవర్ల చేతిలో బాధ్యతలు పెట్టడం కూడా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కోట్రెష్, ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా కోశాధికారి ఆంజనేయులు మాట్లాడుతూ—
ఇటీవల ఆర్టీవో, అర్బన్ సీఐ చేపట్టిన తనిఖీలను స్వాగతిస్తున్నామని, కానీ ఇంకా పలు ట్రావెల్స్ — ముఖ్యంగా మీనాక్షి, మాధవి, ఆల్ మదీనా, చెన్నకేశవ, బళ్లారి ట్రావెల్స్ వంటి సంస్థలు — నియమాలు పాటించకుండా బస్సులు నడుపుతున్నాయని తెలిపారు. కర్నూల్ తరహా ప్రమాదాలు నివారించాలంటే కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు.
విద్యానికేతన్, అయోధ్య, భావన, ఏవీఆర్ స్టోన్ వ్యాలీ, వాణి, పీఎస్ఆర్, పీవీఆర్, వేప్పారాల రామకృష్ణ, బొమ్మణహల్ ప్రతిభ, గోనెహల్ మారుతి వంటి పాఠశాలల బస్సుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులను ఎక్కించడం, సేఫ్టీ గ్రిల్స్ లేకపోవడం వంటి అంశాలు కూడా నిరసనలో ప్రస్తావించబడ్డాయి.
విద్యార్థి–యువజన సంఘాల ముఖ్య డిమాండ్లు
- ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్–కాలేజ్ బస్సులకు తక్షణ ప్రత్యేక తనిఖీలు
- ఫిట్నెస్ లేని వాహనాలను వెంటనే సీజ్ చేయాలి
- కర్ణాటక నుండి తెచ్చిన స్కూల్ బస్సుల సర్టిఫికేట్ల పూర్తి పరిశీలన
- ఓవర్లోడింగ్పై ప్రత్యేక డ్రైవ్
- డ్రైవర్ల లైసెన్స్, అనుభవం, వయస్సు ప్రమాణాల కఠిన పరిశీలన
- ఇన్సూరెన్స్, రూట్ పర్మిట్, ఫిట్నెస్పై పూర్తిస్థాయి తనిఖీలు
- జిల్లా స్థాయిలో ప్రత్యేక రోడ్డు భద్రత కమిటీ ఏర్పాటు
“ప్రజలు, విద్యార్థుల భద్రత రవాణా శాఖ బాధ్యత. నిబంధనలు పాటించని వాహనాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి” అని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కోట్రెష్, ఆంజనేయులు, కుమార్, నాగయ్య, రాజు, తరుణ్, మున్నా, హరికృష్ణ, బాను, ప్రకాష్, శంకర్, సురేష్, జూనైద్, అమన్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment