- విచారణ నివేదికను దాచిపెట్టిన సింగరాయకొండ పోలీసులు
- చర్యలు తీసుకోమంటే హేళన.. ఎదురు మాపైనే తప్పుడు కేసులు
- మహిళా న్యాయవాది కోమటిరెడ్డి కోటేశ్వరి (స్వాతి) ఆవేదన
- ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి
సింగరాయకొండ:
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే.. బాధితులు ఇచ్చిన సాక్ష్యాలను భద్రపరచాల్సిన పోలీసులే వాటిని మాయం చేశారని, ప్రశ్నిస్తే తనపైనే తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని మహిళా న్యాయవాది కోమటిరెడ్డి కోటేశ్వరి (స్వాతి) ఆరోపించారు. ఆమె ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగింది?
మన్నం రంగారావు, చొప్పర చంద్రశేఖర్లు ఫోర్జరీ, చీటింగ్లకు పాల్పడ్డారని కోటేశ్వరి గతంలో 'స్పందన' కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అప్పటి ఏఎస్ఐ మహబూబ్ బాషా.. 11/06/2023న మన్నం రంగారావును విచారించారు. తన తాత మన్నం రామయ్య (ఖాతా నం. 451), తండ్రి మన్నం కోటేశు (ఖాతా నం. 452) పట్టాదారు పాసుపుస్తకాలు తన వద్దే ఉన్నాయని, మరుసటి రోజే స్టేషన్లో అప్పగిస్తానని రంగారావు లిఖితపూర్వక అంగీకార పత్రం రాసిచ్చారు.
ఎస్ఐ నిర్లక్ష్యం - పత్రం గల్లంతు:
అయితే, ఈ ఒరిజినల్ అంగీకార పత్రాన్ని అప్పటి ఎస్ఐ ఫాతిమా ఉద్దేశపూర్వకంగా మాయం చేశారని న్యాయవాది ఆరోపించారు. తన వద్ద ఉన్న అక్నాలెడ్జ్మెంట్ జిరాక్స్ కాపీ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరగా.. "మీరు అడ్వకేట్ కదా.. జిరాక్స్ కాపీపై చర్యలు ఎలా తీసుకుంటారో మీకే తెలియాలి" అంటూ ఎస్ఐ ఫాతిమా, మరో సిబ్బంది టి. శ్రీరామ్లు తనను హేళన చేశారని ఆమె వాపోయారు.
తప్పుడు కేసులు - మీడియా ద్వారా పరువు నష్టం:
పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో, ఆ సాకుతో ఎంఆర్ఓ ఉష తమ భూమి (సర్వే నం. 338/3లో 14 సెంట్లు) విషయంలో ఒత్తిడి తెచ్చారని తెలిపారు. తాము నిరాకరించడంతో తమపైనే ఐపీసీ 353, 355 సెక్షన్ల కింద (క్రైమ్ నం. 186/2023) తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల వివరాలను మీడియాకు విడుదల చేసి తమ పరువు తీశారని ఆమె పేర్కొన్నారు.
తమకు జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తన తండ్రికి న్యాయం చేయాలని న్యాయవాది కోటేశ్వరి వేడుకున్నారు.



Comments
Post a Comment