సోషల్ మీడియాలో దుర్వినియోగం పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున.
September 25, 2025
0
ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున తన పేరును దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న అనుచిత కంటెంట్ను తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం జస్టిస్ తేజస్ కారియాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ముందు నాగార్జున తరఫున న్యాయవాది ప్రవీణ్ణానంద్ వాదనలు వినిపించారు.
న్యాయవాది వాదిస్తూ—“నాగార్జున ఇప్పటివరకు 95 సినిమాల్లో నటించారు. రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడైన ఆయనను ఉగ్రవాదిగా పేర్కొంటూ కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జూదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రొమాంటిక్ సంబంధాల పేర్లు అంటగడుతున్నారు. అంతేకాకుండా, ఏఐతో తయారు చేసిన వీడియోలను యూట్యూబ్ షార్ట్స్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లలో నాగార్జున పేరుతో హ్యాష్ట్యాగ్లు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ సమాచారాన్ని తొలగించేలా సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలి” అని విన్నవించారు.
వాదనలు విన్న న్యాయమూర్తి, అనుచిత కంటెంట్ ప్రసారం చేస్తున్న వెబ్సైట్లు, డొమైన్లను బ్లాక్ చేయాలని టెలికాం డిపార్ట్మెంట్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. ఈ వెబ్సైట్ల జాబితాను తమకు అందించాలని నాగార్జున తరఫు న్యాయవాదికి సూచించారు. అదే సమయంలో కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా ఎక్స్ (పూర్వం ట్విట్టర్) ద్వారా స్పందించిన నాగార్జున, తన పక్షాన నిలిచిన న్యాయవాదులకు, న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు.
