ఇళ్లు నిర్మించుకోని వారికి పట్టాలు రద్దు అంశంపై చర్చ
స్వంత స్థలము కలిగివుండి ప్రభుత్వం ద్వారా ఇళ్లు నిర్మించుకునే వారికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. దీనిపై తహసీల్దార్లు వేగంగా స్పందించి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల గృహ నిర్మాణ శాఖ పి.డిలు, ఈ.ఈలు డి.ఈలు, ఏ.ఈలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ వెరిఫికేషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన– బి.ఎల్.సి. హౌసింగ్ కార్యక్రమం, ఎన్టీఆర్ హౌసింగ్ 2016 నుండి 2019 వరకు పెండింగ్ లో ఉన్న ఇళ్లను మొబైల్ యాప్ లో సర్వే చేయటం, 2021 నుంచి 2024 వరకు మంజూరై పూర్తైనవి, ఇంకా పనులు జరుగుతున్నవి.. అసలు ఇళ్లే నిర్మించుకోని వారు ఎంత మంది ఉన్నారు వంటి అంశాల గురించి చర్చించారు. ప్రస్తుతం హౌసింగ్ విభాగంలో సర్వే జరుగుతున్న విషయంపై ప్రధానంగా చర్చించారు. ఇందులో తహసీల్దార్ల నుంచి పొజిషన్ సర్టిఫికెట్ ఆలస్యమవుతోందని కొందరు అధికారులు చెప్పారు. ఈ సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని.. ఆన్ లైన్ లో సర్టిఫికెట్ త్వరగా వచ్చేలా చూస్తామన్నారు. సర్వే విషయంలో సచివాలయ సిబ్బంది వేగంగా పని చేసేలా ఎంపీడీఓలు, రెవెన్యూ, హౌసింగ్ విభాగం అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. నవంబర్ 5వ తేదీ లోగా సర్వే పూర్తి కావాలన్నారు. గత ప్రభుత్వంలో ఇంటి పట్టాలు తీసుకున్నా.. ఇప్పటి వరకు ఇళ్లు నిర్మించుకోని వారి వివరాల గురించి ఆరా తీశారు. ఈ పట్టాలు రద్దైతే కొత్తవారికి ఇచ్చే అవకాశం ఉంటుందని..ఈ అంశంపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద ఇళ్ల నిర్మాణాలకు రూ.1.50లక్షలు మాత్రమే ఇస్తున్నారని.. ఇది ఏమాత్రం సరిపోవడం లేదన్న అభిప్రాయం లబ్ధిదారుల్లో ఉందన్నారు. ఈ మొత్తాన్ని పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకము క్రింద అర్హులైన లబ్దిదారులు ఆవాస్ ప్లస్ 2024 మొబైల్ యాప్ లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిపై తగిన ప్రచారం జరగాలన్నారు. ఆ దిశగా అధికారులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే సునీత సూచించారు....

Comments
Post a Comment