ఘనంగా నాగుల చవితివేడుకలు
ఆశ్లేష, ఆరుద్ర, మూల,పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ. అనగా ‘నాగం’ సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు. కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే. కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ, పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత.
నిశితంగా పరిశీలిస్తే... అందులో భాగంగానే ‘నాగుపాము’ ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.
ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది.
దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు, రెండు పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక, దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. ‘కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయి ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి
‘నీటిని’ ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా ‘రైతు’ కు పంటనష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా - సంహితల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ, ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలల్లో వివిధ జీవరాశులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.
కద్రువ నాగ మాత, మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.
దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన, ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.
వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి, రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తీక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం.
పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !
పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.
‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.
పంట పొలాలకు శత్రువులు ఎలుకలు, వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
ఆధ్యాత్మిక యోగా పరంగా:-
ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను
'వెన్నుపాము' అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘పాము’ ఆకారమువలెనే వుంటుందని ‘యోగశాస్త్రం’ చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే
'శ్రీమహావిష్ణువు’ నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది.
నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం:
పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా మజ్జిగను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన మజ్జిగ లో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే మజ్జిగ కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే మజ్జిగ లభిస్తుంది. ఆ మజ్జిగను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం, సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.
దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్ పాలయంతి”
అనేది ప్రమాణ వాక్యం,
అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.
నాగుల చవితి మంత్రం:
పాములకు చేసే ఏదైనా పూజ, నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటకం, ఆశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియా, తక్షక, పింగళ , నాగదేవతల పేర్లు.
పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చెప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి : నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.
ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము అని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని, కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం, రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చెవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.
" సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
"లోకా సమస్తా సుఖినోభవన్తు!
Comments
Post a Comment