- ఉరవకొండలో తిరగబడ్డ జర్నలిస్టులు
- జిల్లా అధ్యక్షుడి ఏకపక్ష ధోరణే కారణం
- మంత్రికి బంధువు కావడం తోనే పెరిగిన నియంతృత్వ పోకడలు
- చివరికి ఆయన చానల్ విలేకరి కూడా ప్రత్యర్థి వర్గంలోకి జంప్
- చీకట్లో ఒక "ఈనాడు" విలేకరి అండదండలు
ఉరవకొండ, అక్టోబర్ 15:
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ( ఏపీయూడబ్ల్యూజే ) ఉరవకొండ శాఖలో ముసలం పుట్టింది. అది ఏకంగా తిరుగుబాటుగా మారి... సొంత యూనియన్ ఏర్పాటు చేసుకునేందుకు దారి తీసింది. ఈ పరిణామాలు ఇలా దారి తీయడానికి ఏపీయూడబ్ల్యూజే అనంతపురం జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ వ్యవహార ధోరణే ప్రధాన కారణం అంటున్నారు. పయ్యావుల ప్రవీణ్ ఏపీయూడబ్ల్యూజే అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసున్నప్పటి నుంచి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. పయ్యావుల ప్రవీణ్ నియంతృత్వ పోకడలకు ముఖ్య కారణం, ఆయన జిల్లాకు చెందిన శక్తివంతమైన మంత్రికి బంధువు కావడమే. ఆ ధైర్యంతోనే ఉరవకొండలో ఏపీయూడబ్ల్యూజే శాఖను ఏర్పాటు చేసేటప్పుడు తనకు వ్యక్తిగతంగా కావల్సిన ఆరేడుగురు విలేకరులను పిలిపించుకుని, సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రకటించి, కమిటీని ప్రకటించిపోయారు. ఆ సమయంలోనే మెజార్టీ సంఖ్య జర్నలిస్టులు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. అయితే పయ్యావుల ప్రవీణ్ వ్యవహార శైలి వల్ల ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ జర్నలిస్టుల అసంతృప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో స్థానిక నాయకత్వం పెడ పోకడలు పెరిగిపోతూ వచ్చాయి.
" యథా రాజా... తథా ప్రజా..." అన్న చందంగా జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ వ్యవహరించిన విధంగానే స్థానిక నాయకత్వం వ్యవహరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉరవకొండ నియోజకవర్గంలోనీ మెజార్టీ జర్నలిస్టుల్లో అసంతృప్తి ఒక్క పెట్టున బద్దలైంది. ఈ నెల 12, 13 తేదీల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని దశల వారీగా చర్చించి ప్రత్యేక యునియాన్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారం కోసం తామే ఉద్యమించనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే పయ్యావుల ప్రవీణ్ ప్రాతినిధ్యం వహించే చానల్ యొక్క స్థానిక విలేకరి కూడా కొత్త యూనియన్ లోకి చేరిపోవడం.
* చక్రం తిప్పిన
ఓ "ఈనాడు" విలేకరి...!*
ఉరవకొండ నియోజకవర్గంలో కొత్త జర్నలిస్టు యూనియన్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల వెనుక ఈ ప్రాంతానికి చెందిన ఒక ఈనాడు దినపత్రిక విలేకరి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నిజానికి "ఈనాడు" దినపత్రికల విలేకరులు జర్నలిస్టుల యూనియన్లకు దూరంగా ఉండాలి. ఎవరైనా విలేకరిగా చేరే సమయంలోనే ఈ విషయాన్ని ఆ సంస్థ విధిగా స్పష్టం చేస్తుంది. అయితే ఉరవకొండ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల, ఇక్కడి ఓ "ఈనాడు" దినపత్రిక విలేకరి ఒక వర్గం రాజకీయ నాయకులతో రాత్రిపగలు మమేకం అవుతూ, తన సామాజికవర్గంకు చెందిన వారిని విలేకరులుగా నియమింప చేసుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టు యూనియన్ కూడా తన కనుసన్నల్లో మెలగాలనే ఉద్దేశ్యంతో కొద్ది నెలలుగా ఒక ప్రణాళికను అమలు పరుస్తూ వచ్చాడు. చివరికి ఆ పాచికలు ఫలించాయి. అందుకు సాక్ష్యంగా, కొందరితో ఆయన ఫండింగ్ చేయించాడు. దీంతో ఏపీయూడబ్ల్యూజే కు పెద్ద దెబ్బ తగిలింది. జర్నలిస్టులకు స్వేచ్ఛా వాయువులు లభించాయి.
జర్నలిస్టుల అసంతృప్తికి
అసలు కారణాలు ఇవేనా...
ఉరవకొండలో ఇప్పటికే ఉన్న జర్నలిస్ట్
యూనియన్ నేతలు విలేకరుల సమస్యలు, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఈ విషయమై ఇక్కడి జర్నలిస్టులు గళమెత్తుతూనే ఉన్నారు. ఇందుకు తోడు ఇటీవలి కాలంలో యూనియన్ ముసుగులో మద్యం దుకాణదారులతో కుమ్మక్కై అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు . ఆ మొత్తాన్ని తమ స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారన్న విమర్శలు బలంగా వినిపించాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల దినపత్రికలకు చెందిన కొందరు విలేకరులు మద్యం సిండికేట్ నుంచి ఎక్కువ మొత్తంలో సొమ్ము తీసుకోవడం, వారు అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరి, నియంతృత్వ ధోరణుల వల్లనే బలమైన యూనియన్ ఏర్పాటుకు అడుగులు పడినట్లుగా కూడా పలు కారణాలు చెబుతున్నారు.

Comments
Post a Comment