ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 7
న్యూఢిల్లీ: ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలను రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఎంతమాత్రమూ సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను గౌరవoచాలని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని కోర్టు పేర్కొంది.
ఉత్తరప్రదేశ్కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం.. విమర్శనాత్మక వార్తలు రాసిన జర్నలిస్టును అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణను మంజూరు చేసింది.
'ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి' అని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.

Comments
Post a Comment