- ఏఐఎస్ఎఫ్ వినతికి సానుకూలంగా స్పందించిన జోనల్ చైర్మన్ పూల నాగరాజు
-
త్వరలోనే ప్రత్యేక బస్సు నడిపేలా చర్యలు
ఉరవకొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి చదువు కోసం పట్టణానికి వచ్చే విద్యార్థుల రవాణా కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. దర్గా హోన్నూరు రూట్లో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు సానుకూలత వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
ఉరవకొండ మండలంలోని దర్గా హోన్నూరు, గోవిందవాడ, కలవెల్లి తిప్ప, ఉండబండ, పాల్తూరు తదితర గ్రామాల నుండి వందలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం కోసం నిత్యం ఉరవకొండ పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, సరైన సమయంలో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందు.. ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు దృష్టికి తీసుకువెళ్లారు.
వెంటనే స్పందించిన చైర్మన్:
విద్యార్థుల సమస్యను సావధానంగా విన్న పూల నాగరాజు తక్షణమే స్పందించారు. అక్కడికక్కడే సంబంధిత డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడి, పరిస్థితిని సమీక్షించారు. గ్రామీణ విద్యార్థుల సౌకర్యార్థం అతి త్వరలోనే ఈ రూట్లో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఏఐఎస్ఎఫ్ హర్షం:
విద్యార్థుల సమస్యపై సానుకూలంగా స్పందించి, వెంటనే పరిష్కారానికి చొరవ చూపిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజుకు ఏఐఎస్ఎఫ్ నాయకుడు తగ్గుపర్తి చందు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల ఆయా గ్రామాల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Comments
Post a Comment