అనంతపురం : ఆంధ్రప్రదేశ్లో 2022లో ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణను తక్షణమే ప్రారంభించాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు నవంబర్ 10న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో కూడా వినతిపత్రం సమర్పణ కార్యక్రమం జరిగింది.
జిల్లా జాయింట్ కలెక్టర్ సచిన్ రాజేంద్ర గారికి ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ వినతిపత్రం అందజేశారు.
నాయకుల వ్యాఖ్యలు
ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ —
2022 నవంబరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ, ఫిజికల్, మెయిన్స్, మెడికల్ పరీక్షలు పూర్తి చేసి తుది ఫలితాలు ప్రకటించారు. దాదాపు 6,100 మంది యువతులు, యువకులు విజయవంతమయ్యారు. అయినప్పటికీ నాలుగేళ్లు గడిచినా శిక్షణ ప్రారంభం కాలేదు. ఇది యువతకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది” అని అన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎంపికైన అభ్యర్థులు మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏఐవైఎఫ్ ప్రధాన డిమాండ్లు
1. ఎంపికైన 6,100 మంది కానిస్టేబుళ్ల శిక్షణ షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలి.
2. శిక్షణ ఆలస్యానికి బాధ్యత వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలి.
3. భవిష్యత్తులో ప్రభుత్వ నియామక ప్రక్రియలకు స్పష్టమైన సమయపట్టిక రూపొందించి కచ్చితంగా అమలు చేయాలి.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి, జిల్లా అధ్యక్షులు కోట్రెష్, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు దేవ, ధనుజయ్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment