కరూర్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన దారుణ తొక్కిసలాట ఘటనపై నటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ తీవ్రంగా స్పందించారు. ఖుష్బూ మాట్లాడుతూ, “ఈ ఘటన యాదృచ్ఛికం కాదు... పక్కా ప్రణాళికతో కావాలనే సృష్టించినట్లు కనిపిస్తోంది,” అంటూ తమిళనాడు ప్రభుత్వంపై మండిపడ్డారు. తొక్కిసలాటలో జరిగిన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, దీనికి ఎవరో కావాలనే కారణమై ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. విజయ్ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన స్థలం ఇవ్వకపోవడాన్ని ఖుష్బూ తీవ్రంగా విమర్శించారు. “41 మంది ప్రాణాలు పోయాయి... కానీ సీఎం స్టాలిన్ మాత్రం మౌనం వహిస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడాలి. ర్యాలీలో పోలీసులు లాఠీ ఛార్జ్ ఎందుకు చేశారు?” అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయని, వాటి ఆధారంగా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక కరూర్లో జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేపట్టింది.
Local to international